టాలెంటెడ్ బ్యూటీ కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రష్యాలో పుట్టిన స్వాతి.. వైజాగ్ లో పెరిగింది. 16 ఏళ్ళ వయసులో `కలర్స్` అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. కలర్స్ స్వాతిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వెండితెరపై అడుగు పెట్టింది.
మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన స్వాతి.. `అష్టా చెమ్మా` మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయినా.. నటిగా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. వివాహం అనంతరం కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కలర్స్ స్వాతి.. ఇటీవలె సెకెండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. పంచతంత్రం ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఆమెకు ప్రస్తుతం అడపా తడపా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కలర్స్ స్వాతి.. తన కెరీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.
కెరీర్ పరంగా తాను చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని.. ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలో వెంకటేష్కు మరదలు పాత్ర చేసినందుకు మంచి గుర్తింపు వచ్చిందని.. కానీ ఆ తర్వాత అందరూ మరదలు పాత్రలకే అడిగేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలో బాగా విసిగిపోయానని.. అలాంటి పాత్రలు రిజెక్ట్ చేసుకుంటూ వచ్చానని పేర్కొంది. ఇక గ్రాఫ్ పడిపోతుందనుకున్న ప్రతిసారి ఏదో ఒక హిట్టు పడేది.. అలా ఈరోజున చెప్పుకోవడానికి స్వామి రారా, సుబ్రహ్మణ్యపురం, కార్తికేయ వంటి హిట్లు తన కెరీర్ లో ఉన్నాయని తెలిపింది. ఇకపోతే ప్రస్తుతం తను `మౌత్ ఆఫ్ మధు` అనే సినిమాలో నటిస్తున్నానని పేర్కొంది.