యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ రేసులో దూసుకెళ్తోంది. `ఆర్ఆర్ఆర్`లోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో.. టీమ్ మొత్తం అమెరికాలో భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే హాలీవుడ్ మీడియా సంస్థ అయిన `డెడ్ లైన్`కు రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. 2009లో మగధీర సినిమాకు రాజమౌళితో కలిసి పని చేశానని, రాజమౌళితో తనకు గొప్ప అనుబంధం ఉందని పేర్కొన్నాడు. రాజమౌళి ఇండియన్ జేమ్స్ కేమెరూన్, స్టీవెన్ స్పిల్ బర్గ్ అని కొనియాడారు.
`రాజమౌళి ఫోన్ చేస్తే కాదనలేము. షూటింగ్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయాన్ని కూడా అడగలేము. ఇలాంటి ఏకైక దర్శకుడు బహుశా రాజమౌళి మాత్రమే. ఆయనకు నాకు నచ్చే అంశం ఏమిటంటే.. నటులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. ఆయన ఆలోచించడమే కాకుండా..నీ మైండ్ లో ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతారు. తద్వారా సినీ ప్రయాణంలో నటులు పూర్తిగా భాగస్వాములు అయ్యేలా చేస్తారు.` అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.