ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం కోసం టిడిపి గట్టిగానే కష్టపడుతుంది. గత రెండు ఎన్నికల నుంచి అక్కడ టిడిపి గెలవడం లేదు. రెండుసార్లు చాలా స్వల్ప మెజారిటీల తేడాతో ప్రత్తిపాడు సీటుని టిడిపి కోల్పోతూ వస్తుంది. 2014 ఎన్నికల్లో దాదాపు 3 వేల పైనే ఓట్ల తో ఓడిపోతే..2019 ఎన్నికల్లో 4 వేల పైనే ఓట్లతో ఓడిపోయింది.
అయితే గతంలో ప్రత్తిపాడులో టిడిపి మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో అక్కడ టిడిపి గెలిచింది. గత రెండు ఎన్నికల నుంచి ప్రత్తిపాడులో వైసీపీ గెలుస్తుంది. కానీ ఈ సారి వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సత్తా చాటాలని టిడిపి చూస్తుంది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో టిడిపికి పాజిటివ్ ఎక్కువగా ఉంది. అలాగే వరుపుల రాజా కుటుంబంపై సానుభూతి ఉంది.
గత ఎన్నికల్లో రాజా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. తర్వాత కొన్ని రోజులు పార్టీకి దూరమైన సరే..మళ్ళీ పార్టీ పెద్దలు రాజాని యాక్టివ్ అయ్యేలా చేశారు. అప్పటినుంచి ఆయన దూకుడుగా పనిచేస్తున్నారు. పార్టీ బలాన్ని పెంచుతూ వచ్చారు. అధికార వైసీపీని తట్టుకుని ఎదురునిలబడ్డారు. ఇక పార్టీకి ఆధిక్యం వచ్చింది..ప్రత్తిపాడులో రాజా గెలుపు ఖాయమనుకునే లోపు..ఆయన గుండెపోటుతో మరణించడం టిడిపికి తీరని లోటుగా మిగిలింది.
ఇక కొన్ని రోజుల తర్వాత వరుపుల రాజా సతీమణి సత్యప్రభకు ప్రత్తిపాడు బాధ్యతలు అప్పగించారు. ప్రత్తిపాడు టీడీపీ ఇన్చార్జిగా దివంగత వరుపుల రాజా సతీమణి వరుపుల సత్యప్రభను నియమిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి సత్యప్రభ పోటీ చేయడం ఖాయం..అలాగే గెలుపు కూడా డౌట్ లేదనే చెప్పవచ్చు.