నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు అన్యాయం చేశారంటూ స్టార్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత కొద్ది రోజుల నుంచి తెలుగులో విడుదలైన సినిమాలకు ఆయన తనదైన శైలిలో రివ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే కాకపోయినా.. నెల లేదా రెండు నెలల తర్వాత సినిమాలోని ప్లస్, మైనస్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గోపాలకృష్ణ `వారసుడు(తమిళంలో వరిసు)`కు రివ్యూ ఇచ్చారు.
విజయ్ దళపతి, రష్మిక జంటగా వంశీ పైడపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. అయితే తాజాగా పరుచూరి గోపాలకృష్ణ వారసుడు సినిమా గురించి మాట్లాడుతూ రష్మిక పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వారసుడు సినిమాలో రష్మికను కేవలం పాటలకే మాత్రమే వాడుకున్నారని, నటనకు ప్రయారిటీ ఇవ్వలేదని, నిడివి కూడా చాలా తక్కువే అని అన్నారు. విజయ్, రష్మిక లవ్ ట్రాక్ ను చాలా తక్కువ సీన్లకే పరిమితం చేయడం సినిమాకు పెద్ద మైనస్ అని ఆయన పేర్కొన్నారు. సినిమాలో తండ్రి పాత్ర చనిపోవడాన్ని చూపించారు. తండ్రి అస్థికలు నదిలో కలిపినట్టు చూపించారు, కానీ దానికి బదులుగా హీరోహీరోయిన్లకి పెళ్లి చేసి, తండ్రి అక్షింతలు వేసినట్టు చూపించాల్సిందని పరుచూరి అన్నారు. సినిమాలో హీరోయిన్ పాత్ర పావుగంటయినా పెంచాల్సిందని, ఆమె పాత్రకి అన్యాయం జరిగినట్టే అని వెల్లడించారు. దీంతో పరుచూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈయన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు.