`ఆర్ఆర్ఆర్‌` నిర్మాత‌తో రాజ‌మౌళికి అక్క‌డే చెడిందా..? అందుకే దూరం పెట్టారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ఎంతటి సంచలన విజ‌యాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. గత ఏడాది కాలం నుంచి ఈ సినిమా ఎన్నో రికార్డులను తిర‌గ‌రాస్తుంది. మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటోంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో దూసుకెళ్తూ తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెబుతోంది.

 

అయితే `ఆర్ఆర్ఆర్‌` అంటే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి.. ఈ నాలుగు పేరులే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ నిర్మాత డి.వి.వి. దానయ్యను అందరూ మరిచిపోయారు. అసలు ఆయన ప్రస్తావనే తీసుకురావడం లేదు. ఒక సినిమాను తీయాలంటే నిర్మాత ప్రధాన పిల్లర్‌గా నిలుస్తాడు ఆర్ఆర్ఆర్‌ విషయంలోనూ అదే జరిగింది. కానీ ఇప్పుడు ఆయన్నే పక్కన పెట్టేశారు. గోల్డెన్ గ్లోబ్‌ వేదికపేనే కాదు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఫంక్ష‌న్ లోనూ దానయ్య పేరును ప్రస్తావించలేదు.

అయితే దీని వెన‌క ఓ కారణం బ‌లంగా వినిపిస్తోంది. రాజమౌళితో దానయ్యకు చెడింద‌ట‌. `ఆర్ఆర్ఆర్‌` ని ఆస్కార్ వరకూ తీసుకెళ్లేందుకు ఏడెనిమిది నెలలుగా అమెరికాలో క్యాంపైన్ చేస్తున్నారు. పీఆర్ సంస్థలను నియమించుకుని ఆర్ఆర్ఆర్ సినిమాను అంద‌రినీ దృష్టిలో ప‌డేలా చేశారు. ఇందుకు దాదాపు యాభై కోట్ల‌కు పైమాటే అవుతుంది. కానీ, ఈ డ‌బ్బును తాను సమకూర్చ‌న‌ని దానయ్య ముందే తెగేసి చెప్పార‌ట‌. ఎలాంటి స‌పోర్ట్ చేయ‌న‌ని చెప్పార‌ట‌. ఈ క్ర‌మంలోనే నిర్మాత‌తో రాజ‌మౌళికి చెడింద‌ని.. అందుకే ఆయ‌న్ను దూరం పెట్టార‌ని వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు, `ఆర్ఆర్ఆర్‌`ను ఆస్క‌ర్ బ‌రిలో నిలిపేందుకు అయ్యే మొత్తం ఖ‌ర్చును రాజ‌మౌళినే భారిస్తున్నార‌ట‌.