వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ ఏంటి? అంటే.. నేతలు తముడుకోకుండా చెప్పే మాట… `వైనాట్ 175` వచ్చే ఎన్నికల్లో మొత్తంగా గెలిచి.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయాలని.. తద్వారా దేశంలోనే రికార్డును సొంతం చేసుకోవాలనేది వైసీపీ అధినేత జగన్ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయన నాయకులను తరచుగా అదిలిస్తు న్నారు.. కదిలిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా. ఎందుకు గెలవాలో కూడా చెబుతున్నారు.
ఈ ఒక్కసారి గెలిస్తే.. ఇక మనకు 30 ఏళ్ల పాటు తిరుగు ఉండదని కూడా జగన్ చెబుతున్నారు. దీంతో నాయకులు కూడా అదే ఊపుతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లోమాత్రం నాయకులు చేస్తున్న రాజకీయాలు పార్టీని ఓటమి అంచుకు తీసుకువెళ్లడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇక్కడ నాయకులకు జగన్పై భరోసానే ఉంది. తమపై తమకు లేదు.
పైగా తాము పరాన్న జీవులమని ఒప్పేసుకుంటున్నారు. ఇటీవల చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా.. ఇదే మాట చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో జగన్ బొమ్మతో గెలిచా.. మరోసారి కూడా ఇదే ప్రయత్నం చేస్తానని అన్నారు. మరి ఆయన అభిమానంతో అన్నారో.. లేక అంచనావేసుకునే అన్నారో తెలియదు కానీ.. అనేశారు. సరే.. ఇదంతా ఓకే! ఒక ఎమ్మెల్యేగా ఎలీజా ఏమైనా నియోజకవర్గ అభివృద్ధికి, అక్కడ పార్టీ ఓటు బ్యాంకు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే.. లేదనే చెబుతున్నారు.
గడపగడపకు తిరుగుతున్నారు. ఈ ప్రోగ్రామ్ తాను చాలా బాగా చేస్తున్నానని చెప్పుకుంటున్నా జనాల్లో క్రేజ్ రావడం లేదు. కానీ ఎంచుకున్న ఇళ్లకు.. వార్డులకు వెళ్తున్నారని.. సొంత పార్టీలోనే విమ ర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల జగన్ కూడా చెప్పారు. కొందరు ఎంచుకుని పనిచేస్తున్నార ని చురకలు అంటించారు.
కేవలం ఎలీజా గురించే కాదు.. చాలా మంది ఉన్నారు. సో.. మొత్తంగా చూస్తే.. ఎలీజా వ్యవహారం.. ఆయనను ఓటమి అంచుకు చేరుస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. పైగా ఎంపీ వర్గీయులు ఆయన పర్యటనల్లో ఎక్కడా కానరావడం లేదు. ఎంపీ కోటగిరి శ్రీథర్తో తీవ్రమైన వైరుధ్యం నేపథ్యంలో పార్టీ చాలా వరకు బలహీనపడిపోయింది. రేపు ఎలీజాకు సీటు ఇస్తే ఎంపీ వర్గం సహకరించే పరిస్థితి లేదు. ఈ పరిణామాలన్ని చింతలపూడి వైసీపీకి చావు గంట అయితే మోగించేస్తున్నట్టుగానే ఉంది.