బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తుండగా.. ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 ఏప్రిల్ 21న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. పాన్ ఇండియా సినిమా కావడం వల్ల నెల రోజుల ముందు నుంచే ప్రమోషన్స్ షురూ చేయనున్నారు.
అయితే తాజాగా విరూపాక్ష థియేట్రికల్ రైట్స్ కు అదిరిపోయే రేటు వచ్చిందని ఓ టాక్ బయటకు వచ్చింది. ట్రేడ్ వర్గాల అందుతున్న సమాచారం మేరకు.. `విరూపాక్ష` తెలుగు థియేట్రికల్ హక్కులను రూ. 22 కోట్లకు ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కొనుగోలు చేశాడట. ఈ రేటు ఏపీ, తెలంగాణకు మాత్రమే కావటం విశేషం. సాయి తేజ్ మార్కెట్ కు ఇది చాలా పెద్ద ఆఫర్. అసలు తెలుగు రైట్స్ కే ఈ రేటు వస్తుందని తేజ్ కూడా ఊహించి ఉండడు. ఇక తెలుగు రైట్స్ కే ఇంత వచ్చిందంటే మొత్తం బిజినెస్ ఓ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.