మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన పనికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయన్ను తీవ్ర స్థాయిలో ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.
ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తికాకుండానే త్రివిక్రమ్ మరో సినిమా పనిలో పడ్డాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వినోదయ సితం` రీమేక్ ఇది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.
ప్రముఖ నటుడు సముద్ర ఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అంతే కాకుండా షూటింగ్ జరిగినన్ని రోజులు ఈ మూవీని త్రివిక్రమ్ పర్యవేక్షించనున్నాడు. పవన్-త్రివిక్రమ్ మంచి స్నేహితులు. రీఎంట్రీ తర్వాత పవన్ సినిమాలను దాదాపు త్రివిక్రమ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. గత ఏడాది విడుదలైన `భీమ్లా నాయక్` సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాసే స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఇప్పుడు `వినోదయ సితం` రీమేక్ లోనూ అదే రిపీట్ అవుతంది. దీని కారణంగా మహేశ్ బాబు మూవీ షూటింగ్ మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కోసం మహేష్ కు ఇంత అన్యాయం చేస్తావా అంటూ ఫ్యాన్స్ త్రివిక్రమ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.