టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. పేరు తెచ్చుకోవాలని భావిం చిన యువ నటుడు.. నందమూరి కుటుంబ వారసుడు తారకరత్న.. హఠాన్మరణం చెందారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భారీగా తరలి వచ్చిన అభిమానుల తాకిడితో ఆయన ఒత్తిడికి గురై.. గుండెపోటు సంభవించింది.
ఈ పరిణామాలతో తారకరత్న అశువులు బాశారు. అయితే.. తారకరత్న ఘటన కేవలం.. ఒకనందమూరి కుటుంబానికో.. లేక టీడీపీకో పరిమితం కాదు.. గత ఏడాది కూడా గుంటూరు, కందుకూరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలకు ఇది విభిన్నమూ కాదు. అయితే.. అక్కడ మాస్ ప్రజలు బాధితులుగా మారారు. ఇక్కడ నందమూరి కుటుంబ వారసుడు బాధితుడు అయ్యారు. ఈ క్రమంలో ఏ పార్టీ అయినా.. నేర్చుకోవాల్సిన సూత్రాలు.. పాఠాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.
సభల నిర్వహణ ద్వారా ప్రజామోదం.. ప్రజాదరణ కోరుకోవడం తప్పుకాదు. కానీ, వాటిని నిర్వహించుకునే క్రమంలో ఎదురయ్యే.. పరిణామాలను ముందుగానే అంచనా వేసుకుని.. వాటికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కొరవడి నందునే.. ఈ ఘటనలు సంభవించాయనేది నిష్టుర సత్యం. అయితే.. ఈ ఘటనలు టీడీపీ పక్షంలో జరగడంతో ఓవర్గం మీడియా సైలెంట్ అయిందే కానీ.. ఇవన్నీ.. వైసీపీవైపు జరిగి ఉంటే పరిస్థితి.. ప్రచారం వేరేగా ఉండేది.
సో.. తప్పు ఏ పార్టీలో అయినా.. తప్పే.. అని భావిస్తే.. తక్షణం అన్ని పార్టీలు కూడా జన సమీకరణలపై ఎంత దృష్టి పెడుతున్నాయో.. అంతే స్థాయిలో వారి రక్షణ .. అదేసమయంలో ఆయా కార్యక్రమాలకు వచ్చే నాయకుల రక్షణపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తారకరత్న ఉదంతం ఒక కుటుంబానికే పరిమితం అయినా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకూ అనేక పాఠాలు నేర్పుతోందన్నది వాస్తవం.