అమ్మాయిల అందం చూస్తే తప్పులేదు.. అది కావాలనుకుంటేనే త‌ప్పు: శరత్ కుమార్

సీనియ‌ర్ న‌టుడు శరత్ కుమార్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హీరోగా అవ‌కాశాలు త‌గ్గిన త‌ర్వాత ఈయ‌న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్నారు. తాజాగా ఈయ‌న న‌టించిన `వ‌రిసు` నిన్న త‌మిళంలో విడుద‌ల అయింది. విజ‌య్ ద‌ళ‌ప‌తి, ర‌ష్మిక జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా విజ‌య్ కు తండ్రిగా శ‌ర‌త్ కుమార్ న‌టించాడు. ఆయ‌న భార్య పాత్ర‌లో జ‌య‌సుధ చేయ‌గా.. శ్రీ‌కాంత్‌, శ్యామ్‌, ప్ర‌కాశ్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. జ‌న‌వ‌రి 12 త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి స్పంద‌న ల‌భించింది. ఇక జ‌న‌వ‌రి 14న ఈ చిత్రం తెలుగులో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే దిల్ రాజు హైదరాబాద్ లో ప్రధాన నటీనటులు, చిత్ర యూనిట్ తో మీడియా సమావేశం నిర్వహించారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో శ‌ర‌త్ కుమార్ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. వంశీ పైడిపల్లి డెడికేషన్ ఉన్న దర్శకుడ‌ని.. సినిమా బాగా వ‌చ్చింద‌ని శ‌ర‌త్ కమార్ తెలిపారు. అక్క‌డితో ఆగ‌లేదు.. షూటింగ్ టైమ్ లో తాను చేసిన అల్లరి గురించి శరత్ కుమార్ సరాదాగా మాట్లాడారు. `షూటింగ్ నా టెన్షన్ మొత్తం జయసుధ గారి గురించే. నేను అమ్మాయిలని చూస్తూ ఉండేవాడిని. జయసుధ గారు, నా వైఫ్ రాధిక మంచి ఫ్రెండ్స్‌. నా గురించి ఎక్కడ నా భార్యతో చెప్పేస్తుందో అని టెన్షన్. అందుకే కనిపించకుండా దూరంగా ఉండేవాడిని. ఇక ఒక మగాడిగా అమ్మాయిల అందం చూస్తే తప్పు లేదు. అందానికి మించి కావాలనుకుంటేనే తప్పు` అంటూ శ‌ర‌త్ కుమార్ స‌ర‌దాగా చెప్పుకొచ్చారు. ఇక దిల్ రాజు గారు దిల్ ఉన్న ప్రొడ్యూసర్ అంటూ కొనియాడారు.