మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం జస్ట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. జయ అపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే రవితేజకి ఇప్పుడు వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు పడటంతో ఇదే జోష్లో రెట్టింపు ఉత్సాహంతో వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. గత సంవత్సరం చివరిలో ‘ధమాకా’తో సోలోగా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకున్న మాస్ మహారాజా.. ఈ సంక్రాంతికి చిరంజీవి- రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరో బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో పాటు, రావణాసుర అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు విషయం పక్కన పెడితే.. తాజాగా ఇప్పుడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన ఓ కథకు కూడా రవితేజ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. వీటితోపాటు ఓ రీమిక్ సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించబోతున్నాడని తెలుస్తుంది.
ఇక ఈ రీమేక్ సినిమా గురించి సీనియర్ దర్శకుడు దశరథ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రవితేజ సిద్దు కాంబినేషన్లో ఓ రీమేక్ సినిమాకి తను డైరెక్షన్ చేయమని పలువురు ప్రొడ్యూసర్లు అడిగారని.. నేను మాత్రం రచనకు మాత్రమే పరిమితం అవుతానని దశరథ్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమా దేనికి రీమేక్, ఈ సినిమాకు దర్శక, నిర్మాతలు ఎవరు అన్న విషయం మాత్రం దశరథ్ చెప్పలేదు. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇది ‘మానాడు’ రీమేక్ అని తెలుస్తుంది.
కోలీవుడ్లో శింబు నటించిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. కానీ ‘మానాడు’ తెలుగులో డిజిటల్ గా రిలీజ్ కావడంతో రీమేక్ మీద సందేహాలు ఏర్పడ్డాయి.. కానీ కొంత గ్యాప్ ఇచ్చి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుని రీమేక్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్ రెడీ అయినట్టు తెలుస్తుంది. కోలీవుడ్లో శింబు- ఎస్.జె.సూర్య నటించిన పాత్రలను తెలుగులో రవితేజ- సిద్దు జొన్నలగడ్డ చేయబోతున్నారని తెలుస్తుంది. కానీ ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాపై అధికార ప్రకటన చేయనున్నారు.