కలిసొస్తేనే పొత్తులు..ఒంటరిగా వీరమరణం ఉండదా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్..పొత్తులపై ఎప్పటికప్పుడు కొత్తగా స్టేట్‌మెంట్స్ ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఒకోసారి ఒకోలా పొత్తుల గురించి మాట్లాడుతున్నారనే భావన వస్తుంది. ఎందుకంటే పొత్తులపై ఇప్పటికే పలురకాల స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. మొదట నుంచి వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వమనే చెబుతున్నారు. అది జరగాలంటే ఖచ్చితంగా టీడీపీతోనే పొత్తు ఉండాలి..బి‌జే‌పితో పొత్తు ఉన్న ప్రయోజనం ఉండదు. ఆ విషయం పవన్‌కు తెలుసు.

ఇక బి‌జే‌పితో పొత్తు ఉందని చెబుతూనే..ఆ పార్టీతో ఇంతవరకు కలిసి ఏ కార్యక్రమం చేయలేదు..అటు బి‌జే‌పి సైతం జనసేనని కలుపుకుని వెళ్ళడం లేదు. ఇదే క్రమంలో రెండు సార్లు చంద్రబాబు-పవన్ కలిశారు. దీంతో పొత్తుకు సిద్ధమనే ప్రచారం వచ్చింది. పైగా ఇటీవల శ్రీకాకుళం సభలో ఒంటరిగా వెళ్ళి వీరమరణం పొందడం కంటే..వ్యూహం ప్రకారం ముందుకెళ్లడం బెటర్ అని చెప్పారు. అదే సమయంలో మిమ్మలని నమ్ముకుని ఒంటరిగా బరిలో దిగలనేని జనసేన శ్రేణులని ఉద్దేశించి అన్నారు. అయితే గౌరవప్రదంగానే పొత్తులు ఉంటాయని, లేదంటే అప్పుడు ఒంటరిగా వెళ్దామని చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా పొత్తులపై మరొకసారి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో ప్రస్తుతానికి బీజేపీతో పొత్తు ఉందని, అందువల్ల రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తామని, కాదంటే ఒంటరిగానైనా వెళ్తామని, లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తామని అన్నారు. కాకపోతే ఎన్నికల ముందే పొత్తుల గురించి ఆలోచిస్తామని, ఓట్లు చీలకూడదు అనేది తన అభిప్రాయమని మరోసారి చెప్పారు.

అయితే ఇక్కడ పవన్ వ్యాఖ్యలు అర్ధవంతంగా ఉన్నట్లు అనిపించడం లేదు..బి‌జే‌పితో కలిసి వెళ్తామని అంటున్నారు..టి‌డి‌పి కూడా జనసేనతో పొత్తు కోరుకుంటుంది. కానీ బి‌జే‌పి..టి‌డి‌పితో కలవడానికి ఇష్టపడటం లేదు..అప్పుడు పవన్ ఎలా ముందుకెళ్తారు? ఏవి కుదరకపోతే ఒంటరిగా వెళ్తామని అంటున్నారు..అసలు టి‌డి‌పి పొత్తు వద్దని, లేదని గాని చెప్పడం లేదు. ఎన్నికల ముందే పొత్తుల గురించి అని చెబుతుంది. మరి చూడాలి చివరికి టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందో లేదో.