కాజ‌ల్ చేసిన ప‌నికి ల‌బోదిబోమంటున్న ఫ్యాన్స్‌.. ఏం జ‌రిగిందంటే?

సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ కాజల్ అగర్వాల్.. 2020లో ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన‌ కొద్ది నెలలకే ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చిన కాజల్.. గత ఏడాది ఏప్రిల్ లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక బిడ్డకు ఆరు నెలలు నిండిన వెంటనే కాజల్ మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

ఆల్రెడీ తమిళంలో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న `ఇండియ‌న్ 2` సినిమాలో నటిస్తోంది. తాజాగా తెలుగులో సైతం ఓ ప్రాజెక్ట్ కు సైన్ చేసిందట. నట సింహం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావ్కోడి కాంబినేషన్లో `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ ఫ‌స్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

అయితే ఈ సినిమాలో బాలయ్య కు జోడిగా కాజల్ ఎంపిక అయిందని.. ఇప్పటికే సంప్రదింపులు సైతం పూర్తి అయ్యాయని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. ఈ విషయంపై కాజ‌ల్ ఫ్యాన్స్ ల‌బోదిబోమంటున్నారు. ఎందుకంటే ఎన్‌బీకే 108 కథ తండ్రి, కూతురు మధ్య సాగుతుంది. ఇందులో బాలయ్య కూతురుగా శ్రీలీల ఎంపికైంది. ఇప్పుడు కాజల్ ఈ సినిమాకు ఓకే చెప్తే శ్రీలీల‌కు తల్లి కనిపించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కాజల్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక యంగ్‌ హీరోయిన్ కు తల్లి పాత్రలో నటిస్తే కాజల్ కెరీర్‌ డేంజర్ జోన్ లో పడుతుందని.. ఇక ముందు కూడా అలాంటి పాత్రలే వ‌స్తాయ‌ని ఫాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు.