అమ్మా న‌న్ను క్ష‌మించు, ఆ రోజు నీకు చెప్ప‌లేక‌పోయా.. సాయి తేజ్ ఎమోష‌న‌ల్‌!

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ రీసెంట్ గా 15వ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సంయుక్త హీన‌న్ హీరోయిన్ గా ఎంపిక అయింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ మూవీకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. కాంతార సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. అయితే నేడు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వాయిస్ తో వ‌చ్చిన ఈ గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాకు `విరూపాక్ష‌` అనే టైటిల్ ఖ‌రారు చేశారు.

అయితే విరూపాక్ష గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశాడు. `అమ్మా.. హాస్పిట‌ల్ బెడ్ పై ఉన్న‌ప్పుడు నీకో విష‌యం చెప్ప‌లేక‌పోయా.. ఇప్పుడు చెబుతున్నా.. సారీ న‌న్ను క్ష‌మించు అలాగే ల‌వ్ యూ అమ్మా. నేను ఈ సినిమా చేసింది, ఇంత క‌ష్ట‌ప‌డింది నీకోస‌మే` అంటూ చెప్పుకొచ్చారు. అనంత‌రం ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. `2007లో ఫస్ట్ టైమ్ నేను నిన్ను కలిసినప్పుడు నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నావో, ఇప్పుడు కూడా అలానే ట్రీట్ చేశావు. వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు చాలా థాంక్యూ తారక్. ఎవరు ఏమనుకున్నా నీ స్నేహం ఎప్పటికి నాతో ఇలానే ఉండాలి` అని పేర్కొన్నాడు.