సెంట్రల్‌లో బోండాకు సెగలు..రిస్క్ అవుతుందా?

గత ఎన్నికల్లో టీడీపీ దురదృష్టం కొద్ది గెలుపు దగ్గరకొచ్చి ఓడిపోయిన సీట్లలో విజయవాడ సెంట్రల్ సీటు కూడా ఒకటి. మొదట ఈ సీటులో టీడీపీ గెలిచిందని ప్రకటన వచ్చింది. కానీ మళ్ళీ రీకౌంటింగ్ చేయడం, ఆ తర్వాత 25 ఓట్ల తేడాతో వైసీపీ నేత మల్లాది విష్ణు గెలిచారని ప్రకటన వచ్చింది. అలా 25 ఓట్లతో మల్లాది గెలిచారు. అయితే ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్తితులు ఊహించని విధంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే మల్లాదికి పెద్దగా పాజిటివ్ కనిపించడం లేదు.

సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేక వర్గాలు వస్తున్నాయి. అటు టీడీపీ నేత బోండా ఉమా దూకుడుగా పనిచేస్తున్నారు..ప్రజల్లో తిరుగుతున్నారు..ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే ఇక్కడ జనసేనకు కూడా కాస్త బలం ఉంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే డౌట్ లేకుండా టీడీపీ నుంచి బోండా గెలవడం ఖాయం. పొత్తు లేకపోయినా ఇక్కడ బోండాకు కాస్త ఎడ్జ్ కనిపిస్తోంది.

కాకపోతే ఇక్కడ గ్రూపు తగాదాలు ఉన్నాయని చెప్పి వైసీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీని వల్ల బోండాకు నెగిటివ్ అని చెబుతున్నారు. వాస్తవానికి వారు చెప్పే గ్రూపులు కేశినేని చిన్ని, వంగవీటి రంగా వర్గాలు. అయితే ఈ ఇరువురు నేతలు బోండాతో సఖ్యతగానే ఉంటున్నారు. వారి సపోర్ట్ కూడా బోండాకు ఉంది. అలాంటప్పుడు గ్రూపు పోరుకు ఆస్కారం లేదు.

కాకపోతే ఎంపీ కేశినేని నానితో బోండాకు పడదు. సెంట్రల్‌లో కేశినేని వర్గం ఉంది. వారు ఏమన్నా బోండాకు యాంటీగా ఉండవచ్చు. కానీ వైసీపీని ఓడించాలనే కసి మీద ఉన్న టీడీపీ శ్రేణులు..వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కానీ విజయవాడ వెస్ట్ టీడీపీలో మాత్రం గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్నాయి. సెంట్రల్, ఈస్ట్ స్థానాల్లో అంతగా లేవు. కానీ వైసీపీ మీడియా ఏదొకటి క్రియేట్ చేసి బోండాపై నెగిటివ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.