ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `డీజే టిల్లు` ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి విమల్కృష్ణ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ గా మారాడు.
ఇక ఈ సినిమాకు `టిల్లు స్క్వేర్` టైటిల్ తో సీక్వెల్ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీక్వెల్ లో నేహా శెట్టిని కాకుండా మరో హీరోయిన్ ఎంపిక చేయాలని మేకర్స్ భావించారు. కానీ, హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేసిన కొద్ది రోజులకే ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నారు. ఈ లిస్టులో అనుపమ పరమేశ్వరన్, శ్రీలీల, మడోన్నా సెబాస్టియన్, మీనాక్షి చౌదరి తదితరులు ఉన్నారు.
ముఖ్యంగా అనుపమ దాదాపు ఈ సినిమాలో హీరోయిన్గా కన్ఫామ్ అయింది. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. తాజాగా `18 పేజెస్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న అనుపమను.. టిల్లు స్క్వేర్ గురించి ప్రశ్నించగా ఆమె అసలు మాట్లాడటానికి కూడా ఇష్టపడకపోవడం గమనార్హం. `ఇప్పుడు 18 పేజెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. టిల్లు స్క్వేర్ లో ఏం జరుగుతుందో నాకు తెలియదు` అంటూ అనుపమ మాట దాటవేసే ప్రయత్నం చేసింది. దీంతో టిల్లు స్క్వేర్ లో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.