వీర‌య్య‌కు ప్యాక‌ప్ టైమ్ వ‌చ్చేసింది.. మ‌రి వీర‌సింహా ప‌రిస్థితేంటి?

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్‌ హీరోలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు కాగా.. మరొకరు నటసింహం నందమూరి బాలకృష్ణ. చిరంజీవి ప్రస్తుతం బాబి దర్శకత్వంలో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ నటిస్తుంటే.. మాస్ మహారాజ్ రవితేజ ఓ కీల‌క పాత్రను పోషిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతోంది. ఈ మూవీ షూటింగ్ దాదాపు ఆఖరి దశకు చేరుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. వీర‌య్య మ‌రో వారం రోజుల్లో ప్యాకప్ చెప్పేయ‌బోతున్నాడని తెలుస్తోంది. షూటింగ్ పూర్తయిన వెంటనే ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, మరోవైపు ప్రమోషన్ పనులు పై దృష్టి పెట్ట‌బోతున్నార‌ట‌.

ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఈయ‌న `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలోనూ శృతిహాసనే హీరోయిన్‌గా నటిస్తోంది. పైగా మైత్రీ వారే ఈ చిత్రాన్ని సైతం నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఇంకా ఒక్క షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ఆ షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలోనే మేకర్స్ ఉన్నారు. మరో పది రోజుల్లో వీర సింహారెడ్డి షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి హడావుడిగా షూటింగ్ జరుపుకుంటున్న వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి చిత్రాల్లో సంక్రాంతి విన్నర్ ఏది అవుతుందో చూడాలి.