`ఆదిపురుష్`లో కీలక మార్పులు.. హాట్ టాపిక్ గా అద‌న‌పు ఖ‌ర్చు?

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రాత్‌ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీత‌గా అల‌రించ‌బోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు.

సన్నీ సింగ్, హేమామాలిని తదితరులు ఇతర కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల `ఆదిపురుష్‌` టీజ‌ర్ ను కూడా బయటకు వదిలారు. కానీ ఈ టీజర్ పై ఎంతో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ప్రభాస్ అభిమానులు సైతం ఈ టీజ‌ర్‌ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

దీంతో మార్పులు చేర్పులు చేసేందుకు ఆదిపురుష్‌ విడుదలను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. ఇందులో భాగంగానే దిద్దుబాటు చర్యలు చేపట్టిన‌ చిత్ర టీం.. సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్న రావణుడి లుక్ పూర్తిగా మార్చనున్నారట. రావణుడి పాత్ర అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రను పోలినట్లు ఉందంటూ వ‌చ్చిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో.. వీఎఫ్ఎక్స్ ద్వారా సైఫ్ లుక్‌ను మారుస్తున్నార‌ట‌. ఈయన లుక్ మార్చేందుకే దాదాపు రూ. 30 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. దీంతో ఇప్పుడు ఈ అద‌న‌పు ఖ‌ర్చు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.