స‌మంత‌ ముందు అక్కినేని హీరోలు దిగ‌దుడుపే.. ఇదిగో ఫ్రూవ్‌!?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స‌మంత నుంచి వచ్చిన తొలి చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక‌ కృష్ణ ప్రసాద్ పాన్‌ ఇండియా స్థాయిలో దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నవంబర్ 11న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ సొంతం చేసుకుంది.

అలాగే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ సినిమా విడుదల తర్వాత సమంత ముందు అక్కినేని హీరోలు దిగ‌దుడుపే అంటూ ఆమె అభిమానులు నెట్టింట‌ ప్రచారం చేయడం షురూ చేశారు. వాస్త‌వానికి ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగిన అక్కినేని నాగార్జున.. సోలోగా హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఈయన నుంచి ఇటీవల వచ్చిన `ది ఘోస్ట్` బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

ఇక ఆయన తన‌యుల విషయానికి వస్తే.. అక్కినేని నాగచైతన్య ఒకప్పుడు వరస హిట్లను ఖాతాలో వేసుకున్నా ఇటీవల మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయ‌న‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న థ్యంక్యూ, లాల్ సింగ్ చడ్డా చిత్రాలు ఎలాంటి ఫలితం అందుకున్నాయో తెలిసిందే. ఇక అఖిల్ నుంచి చివరిగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకుంది. కానీ అక్కినేని మాజీ కోడలు సమంత మాత్రం వరస హిట్లతో త‌న మార్కెట్ ను పెంచుకుంటూ పోతుంది. ఇక తాజాగా విడుదలైన య‌శోద‌తో సమంత క్రేజ్ డబల్ అయింది. దీంతో సమంత ముందు అక్కినేని హీరోలు దిగ‌దుడుపే అని, అందుకు యశోద సినిమానే ప్రూఫ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.