మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో తెరకెక్కుతున్న 15వ చిత్రమిది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాలని భావించాడు. వీరి కాంబో ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ముందే ఆగిపోయింది. దీంతో రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా పేర్లు తెరపైకి వచ్చాయి.
వీరిద్దరిలోనే ఎవరో ఒకరితో రామ్ చరణ్ తన నెక్స్ట్ ను ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సూపర్ ట్విస్ట్ నెలకొంది. గురుశిష్యులకు కాకుండా `బింబిసార` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వశిష్టకు రామ్ చరణ్ ఓటేశాడట. ఇప్పటికే వశిష్ట ఒక కథను రామ్ చరణ్ కు వినిపించాడట. అది ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. పీరియాడిక్ కథాంశంతో వీరి కాంబో సినిమా తెరకెక్కబోతోందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుందని టాక్ నడుస్తోంది.