ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గుడ్‌న్యూస్ వింటే ఎగిరి గంతేస్తారు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ప్రత్యేక రోజులను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో మంచి విజయాలను సాధించిన చిత్రాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, బిల్లా, నువ్వే నువ్వే, వర్షం, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వ‌సూళ్ల‌ను రాబట్టాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఆయన కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా `బాద్‍షా`ను మళ్లీ థియేటర్స్ లో అలరించేందుకు సిద్ధమవుతోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. 2013 ఏప్రిల్ 5న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

శ‌క్తి, ద‌మ్ము వంటి ఫ్లాపుల తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాతో సాలిడ్ హిట్‌ అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను నవంబర్ 19న వరల్డ్ వైడ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడమే కాదు.. బుకింగ్స్ ఓపెన్ అంటూ ట్వీట్ కూడా చేశారు. ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. మరి బాద్‍షా రీ రిలీజ్‌ లో ఎలాంటి రికార్డును కొల్లగొడుతుందో చూడాలి.