లండన్ కు మ‌కాం మార్చిన అనుష్క‌.. కార‌ణం అదేన‌ట‌!?

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు చేసి అగ్ర హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఓవైపు స్టార్ హీరోల స‌ర‌స‌న నటిస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ `భాగమతి` తర్వాత ఈ అమ్మడు సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది.

వరుస ఆఫర్లు వస్తున్న సరే చాలా నెమ్మదిగా కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క లండన్ కు మకాం మార్చింద‌ట‌. అయితే పర్మినెంట్ గా కాదండోయ్‌.. షూటింగ్ నిమిత్తం ఆమె లండన్ కు వెళ్ళింది. ప్రస్తుతం అనుష్క యంగ్‌ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క కెరీర్‌లో 48వ ప్రాజెక్ట్ ఇది. మహేష్ పి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో అనుష్క అన్విత రవళి శెట్టి అనే చెఫ్‌ పాత్రలో కనిపించబోతోంది.

ఇటీవల ఈమె ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా చిత్ర టీం తదుపరి షెడ్యూల్ కోసం యూకే వెళ్ళింది. లండన్ సిటీ తో పాటు శివార్లలో ప‌లు కీల‌క సన్నివేశాలను చిత్రీకరించేందుకు అక్క‌డ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగానే అనుష్క లండన్ కు వెళ్ళింది. పది రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తోంది. లండన్ షెడ్యూల్ ముగిసిన తర్వాత అనుష్క అండ్ టీం హైదరాబాద్ కు రానుంది. ఇక శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.