సౌత్‌కొరియాకు చెక్కేసున్న సమంత.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతో యావత్ తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో కొలువైన నటి సమంత అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే సామ్ సినిమా జీవితం పరంగా ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యక్తి గత జీవితం మాత్రం అంత బాలేదని చెప్పుకోవాలి. విడాకుల సంగతి పక్కన బెడితే, గత కొన్ని రోజులుగా ఆమె మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే కదా.

సమంత ఈ విషయాన్ని ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. పుండుమీద కారం జల్లినట్టు సమంత ఆరోగ్యం తీవ్రంగా క్షీణించందంటూ పుకార్లు పుట్టిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. అయితే తాజాగా మరోసారి ఆమెకి సంబంధించిన వార్తలు తెగ వైరల్‌ అవుతున్నాయి. సమంత చికిత్సలో భాగంగా సౌత్‌ కొరియా వెళుతోందని వినికిడి. లోగుట్టు పెరుమాళ్ళకెరుకగాని అడ్వాన్స్‌ ట్రీట్‌మెంట్‌లో భాగంగానే సమంత సౌత్‌ కొరియాకు వెళుతోందని, నెల రోజుల పాటు అక్కడే ఉండనుందని దాని సారాంశం.

ఈ చికిత్స పూర్తయిన తర్వాత తిరిగి ఇండియాకు వచ్చి ఖుషీ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతుందని చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై సమంత మేనేజర్ నుంచి కానీ, సమంత నుంచి కానీ ఎలాంటి సమాచారం రాకపోవడం కొసమెరుపు. అయితే సమంత నిజంగానే సౌత్‌ కొరియా వెళ్తుందా? లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ఇక సినిమాల సంగతి చూస్తే తాజాగా యశోద చిత్రంతో భారీ విజయాన్ని సమంత అందుకుంది. అలాగే ఇక గుణశేఖర్ సినిమా శాకుంతలం షూటింగ్ పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.