రూట్ మార్చనున్న రవితేజ… ఈసారి విలన్ అవతారంలో?

మీరు విన్నది నిజమే. మాస్ మహారాజ్ రవితేజ త్వరలో నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రను చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తమిళ తంబీ శింబు హీరోగా S. J. సూర్య కీలక పాత్రలో వెంకట్ ప్రభు తెరకెక్కించిన మూవీ మానాడు. తమిళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ తరుపున హీరో రానా దక్కించుకున్నట్టు భోగట్టా. ఈ మూవీ స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చే బాధ్యతల్ని రానా స్టార్ డైరెక్టర్ అయినటువంటి హరీష్ శంకర్ కు అప్పగించాడని సమాచారం.

ఇకపోతే ఈ రీమేక్ కు దర్శకుడు మాత్రం హరీష్ శంకర్ మాత్రం కాదు. కేవలం కథ, కధనం అందించనున్నాడు. కాగా దశరథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. అలాగే మన రవితేజ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం హరీష్ శంకర్ ఎదురుచూసి, చూసి నీరసపడిపోయారు. ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేక హరీష్ శంకర్ గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ మానాడు తెలుగు రీమేక్ కు వర్క్ చేస్తున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

మానాడు సినిమాలో ఎస్ జె సూర్య చేసిన పాత్ర కోసం రవితేజ ను అడుగుతున్నట్లు సమాచారం. అంటే ఆ పాత్ర విలన్ పాత్ర. మరి రవితేజ అభిమానులు ఆ పాత్ర చేస్తే జీర్ణించుకుంటారా లేదా అన్నది చూడాలి. అయితే ఆ పాత్ర చాలా డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్ర కనుక రవితేజ చాలా ఇష్టపడి చేస్తాడని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. మరో ప్రక్క శింబు చేసిన పాత్రలో సిద్దూ జొన్నలగడ్డ కనిపించనున్నారని చెప్తున్నారు. అయితే ఈ విషయంపైన ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.