విశాఖ వైసీపీలో సీట్లు చేంజ్?

గత కొన్ని రోజులుగా అధికార వైసీపీలో ఒకే అంశంపై ఎక్కువ చర్చ నడుస్తోంది…అది కూడా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి సీటు ఇచ్చే విషయం డౌటే అని…ఇప్పటికే జగన్ పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు లేదని చెప్పేశారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు సిట్టింగులని పక్కన పెట్టేయడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయంలో పక్కన పెడితే…మళ్ళీ నేతల్లో అసంతృప్తి పెరిగి వైసీపీకి ఇబ్బంది అవుతుంది…అందుకే ఇప్పటినుంచే ఏ ఏ సీట్లలో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చేస్తున్నారట.

ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కొందరు సిట్టుగులకు సీటు డౌటే అని తెలుస్తోంది. మొత్తం 15 స్థానాలు ఉన్న విశాఖలో గత ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లు గెలుచుకోగా, టీడీపీ 4 సీట్లు గెలుచుకుంది. ఒక టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వచ్చారు. దీంతో వైసీపీ బలం 12కు చేరుకుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఈ 12 మందికి సీట్లు దక్కుతాయా? అంటే చెప్పడం కష్టమే.

ఐదారు స్థానాల్లో మార్పులు జరగవచ్చని తెలుస్తోంది. విశాఖ దక్షిణ, పాయకరావుపేట, నర్సీపట్నం, అరకు, గాజువాక, పాడేరు సీట్లలో మార్పు జరగొచ్చని సమాచారం. విశాఖ సౌత్ సీటు టీడీపీ గెలుచుకున్నది…కానీ టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేశ్ వైసీపీలోకి వచ్చారు…దీంతో నెక్స్ట్ ఆయనకు వైసీపీలో సీటు దొరుకుతుందో లేదో క్లారిటీ లేదు.

అలాగే టీడీపీ చేతుల్లో ఉన్న విశాఖ ఈస్ట్, వెస్ట్ సీట్లలో వైసీపీ ఇంచార్జ్‌లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ని ఈ సారి అనకాపల్లిలో కాకుండా గాజువాక బరిలో దించుతారని ప్రచారం జరుగుతుంది. అలాగే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ సీటు కూడా మారవచ్చని తెలుస్తోంది. ఈ సారి పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చూసుకునే విశాఖ వైసీపీలో ఈసారి భారీ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది.