తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేం ద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమం లో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రాంతీయ ప్రార్టీను కేసీఆర్ ఏకం చేస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. వారితో చర్చిస్తున్నారు. అయితే.. పొరుగునే ఉన్న ఏపీ విషయానికి వస్తే.. కేసీఆర్ కనీసం పన్నెత్తు మాట కూడా మాట్లాడడం లేదు.
ఏపీలో కూడా బీజేపీయేతర ప్రాంతీయ పార్టీ వైసీపీ అధికారంలో ఉంది. పైగా 22 మంది ఎంపీలతో బలంగా ఉంది. అయినా కూడా కేసీఆర్ ఏపీవైపు తొంగి చూడడం లేదు. ఏపీ ముఖ్యమంత్రితోనూ ఆయన చర్చిం చడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా పదం కలుపుదామనే పిలుపు కూడా ఇవ్వడం లేదు. దీంతో అసలు జగన్.. కేసీఆర్తో కలుస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ విషయంపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. ఒక ప్రకటన చేశారు.
జగన్ కేసీఆర్తోనే ఉన్నారని.. చెప్పారు. కానీ, ఇటీవల కాలంలో కేసీఆర్కు జగన్కు మధ్య మాటలు లేవు. ఏపీ విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని జగన్ అంతర్గతంగా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీకి కానీ.. కేంద్రంపై యుద్ధానికి కానీ.. జగన్ ఏమేరకు మద్దతు ఇస్తారనేది ప్రశ్న. అయితే.. కేంద్రంలో బీజేపీ పలచన పడితే.. కనుక.. మోడీ మరోసారి కేంద్రంలో పాగా వేసే అవకాశం లేదని తెలిస్తే.. కనుక.. జగన్ ఖచ్చితంగా కేసీఆర్కు మద్దతిస్తారనే చర్చ మరోవైపుసాగుతోంది.
అయితే.. వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం పదిలంగానే ఉందని చెప్పేవారు మరికొందరు ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఇతోధికంగా సాయం చేశారనే వాదన ఉంది. ఏపీలో జగన్ సర్కారు ఏర్పడాలని కోరుకున్న వారిలోనూ.. కేసీఆర్ ముందున్నారు. ఈ నేపథ్యంలో జగన్.. తనను వీడిపోడని, ఎప్పటికైనా.. తమ వెంటే నడుస్తారని.. కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే..ఇప్పటికిప్పుడు జగన్ను కదిపి.. ఆయనను ఇబ్బంది పెట్టేకన్నా.. ఎన్నికల సమయానికి కలుపుకొని పోవడమే బెటర్ అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.