బాల‌య్య‌-చంద్ర‌బాబుకు గ్యాప్ పెరిగిందా… ఈ ప్రచారం వెన‌క క‌థేంటి…!

ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఇరుకున పెట్టాల‌నే విష‌యంలో నాయ‌కులు.. చాలా దూకుడుగా ఉంటారు. అయితే.. ఒక్కొక్క‌సారి ఈ విష‌యంలో నాయ‌కులు చేసే విన్యాసం బూమ‌రాంగ్ అవుతాయి. ఇప్పుడు.. ఇలాంటి ఘ‌ట నే.. వైసీపీ విష‌యంలోనూ చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన ఓ కార్య‌క్ర‌మానికి సంబంధించి.. వైసీపీ స్థానిక నాయ‌కులు.. కోడిగుడ్డుపై ఈక‌లు పీకే ప‌ని ప్రారంభించార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Balakrishna-Chandrababu | klapboardpost

హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఏడాది పాటు కొన‌సాగేలా.. రూ.5 కే నాణ్య‌మైన భోజ‌నం అందించే.. మొబైల్ క్యాంటీన్‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మొబైల్ ఆరోగ్య సేవలు అందించే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్టారు. రూ.40 లక్షల సొంత నిధులను వెచ్చించి మ‌రీ ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థాన్ని పేద‌ల‌కు.. అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.

ఈ ప్రత్యేక బస్సులో వైద్య పరికరాలు, టెస్టింగ్‌ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అత్య వ‌స‌ర చికిత్స‌ల‌కైనా.. దీనిలో వైద్యం అందేలా… ఏర్పాట్లు చేశారు. అయితే.. ఈ ఆరోగ్య ర‌థంపై.. బాల‌య్య ఫొటోను, మాజీ సీఎం , టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు.. ఎన్టీఆర్ ఫొటోను మాత్ర‌మే ముద్రించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఫొటోను మాత్రం ముద్రించ‌లేదు. ఇదే విష‌యంపై వైసీపీ నాయ‌కులు ర‌చ్చ చేస్తున్నారు. ఇంకేముంది.. బాల‌య్య‌కు-చంద్ర‌బాబుకు గ్యాప్ పెరిగిపోయిందంటూ.. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే.. వాస్త‌వానికి బాల‌య్య ఈ ప‌నిని వేరేవారికి అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో వారు చంద్ర‌బాబు ఫొటోను మ‌రిచిపోయి ఉండొచ్చ‌ని.. అంత మాత్రాన దీనిని రాద్ధాంతం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో పార్టీ కోసం.. త‌న ఇంటి వారిని వాడుకుని.. వ‌దిలేసిన వైసీపీ అధినేత క‌న్నా.. తమ నాయ‌కుడు చేసిన త‌ప్పేంలేద‌ని వారు చెబుతున్నారు. దీంతో ఈ విష‌యం హిందూపురంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఇరు వ‌ర్గాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే.. భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి ఏర్ప‌డింది.