అక్కినేని అభిమానులకు శుభవార్త.. 40 ఏళ్ల కితం ఆగిన ANR సినిమా రిలీజ్ కాబోతోంది!

అవును, ఇది నిజంగా అక్కినేనికి అభిమానులకు ఓ పండగలాంటి వార్తనే చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అప్పట్లోనే ఒక ట్రెండ్ ని తీసుకొచ్చిన అలనాటి దిగ్గజ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తన ఫ్యామిలీకి, అభిమానులకి ప్రాణమనే చెప్పుకోవాలి. ANR కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు అప్పట్లోనే వచ్చాయి. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా అనేకం ఉన్నాయి. దేవదాసు అనే సినిమాలు ఎన్ని వచ్చినా మన తెలుగు సినిమా దేవదాసుని మించిన సినిమా లేదనే చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పొతే ఆ లిస్ట్ పెరిగిపోతుంది గాని, ఈ దిగ్గజ హీరో నటించినటువంటి అలనాటి ఓ చిత్రం ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత విడుదలకి సిద్ధం అయింది.

వివరాల్లోకి వెళితే… 1982లో “ప్రతి బింబాలు” అనే చిత్రాన్ని ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు మరియు కె ఎస్ ప్రకాష్ రావు లు కలిసి దర్శకత్వం వహించారు. ఇందులో కధానాయికగా అలనాటి సహజనటి జయసుధ హీరోయిన్ గా నటించారు. అయితే అప్పట్లో ఈ చిత్రం కంప్లీట్ అయినా కూడా పలు కారణాల చేత రిలీజ్ కి నోచుకోలేదట. అందువలన ఈ సినిమాని త్వరలో ప్రేక్షకల ముందుకు తీసుకురాబోతున్నారని టాలీవుడ్ సమాచారం.

ఇక రిలీజ్ ఎప్పుడంటే ఈ ఏడాది సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జయంతి కదా. ఈ సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాత ప్రకటించినట్టు వార్తలు వినబడుతున్నాయి. అయితే అధికారిక ప్రకటన ఇంకా రావలసి వుంది. అయితే ఈ సినిమా ఇపుడు రిలీజ్ అనేది అక్కినేని అభిమానులకి అయితేనేమి మూవీ లవర్స్ అయితేనేమి ఒక కొత్త అనుభూతిని అందిస్తుంది అని చెప్పాలి. ఈ సినిమా అనుకున్నట్టుగా తప్పకుండా రిలీజ్ కావాలని ఆశిద్దాము.