ఆ నాలుగు సిట్టింగ్ సీట్లు డౌటే..!

అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు. స్వయానా సీఎం జగన్ సైతం ఆ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు..రానున్న ఆరు నెలల్లో ప్రజా మద్ధతు పెంచుకోకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు. దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో సొంత పోరు సైతం వైసీపీకి పెద్ద తలనొప్పి అయిపోయింది. ఒకో జిల్లాలో కనీసం నాలుగైదు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎక్కడకక్కడ గ్రూపులుగా విడిపోయి సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు.

దీని వల్ల ఎవరికి ఎంత లాభం ఉందో తెలియదు గాని…ఫైనల్ గా పార్టీకి మాత్రం తీవ్ర నష్టం జరిగేలా ఉంది. ఇక ఈ గ్రూపు తగాదాలు ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ప్రకాశం కూడా ఒకటి. ఈ జిల్లాలో ఏదో మూడు, నాలుగు నియోజకవర్గాల్లో మిగిలిన స్థానాల్లో నేతల మధ్య పోరు నడుస్తోంది. ఇక ఈ పోరు వల్ల కొన్ని స్థానాల్లో డ్యామేజ్ తక్కువగానే ఉండొచ్చు గాని…కొన్ని స్థానాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఉండేలా లేదు.

ముఖ్యంగా వైసీపీ సిట్టింగ్ స్థానలైన నాలుగు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో నడుస్తోంది. అలా ఆధిపత్య పోరు ఎక్కువ ఉన్న స్థానాల్లో దర్శి, సంతనూతలపాడు, కనిగిరి, మార్కాపురం స్థానాలు ఉన్నాయి. ఈ నాలుగు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు..అదే సమయంలో వీరికి వ్యతిరేక వర్గాలు కూడా ఉన్నాయి. దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెలి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించారు. దీని వల్ల వైసీపీ గెలుపుకు ఇబ్బంది. ఇప్పటికే దర్శి సీటు బూచేపల్లికే అని జగన్ పరోక్షంగా చీమకుర్తి సభలో హింట్ ఇచ్చేశారు.

అటు సంతనూతలపాడులో ఎమ్మెల్యే సుధాకర్ కు వ్యతిరేకంగా కొందరు నేతలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా నాగలుప్పలపాడు మండల నేతలు పూర్తిగా యాంటీగా ఉన్నారు. మద్దిపాడులో ఓ వర్గం నేతలు ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నారు. అలాగే మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, జంకే వెంకటరెడ్డి వర్గాలకు పడటం లేదు. ఏ మండలంలోనైనా ఈ ఇద్దరు నేతలకు సెపరేట్ గ్రూపులు ఉన్నాయి. అలాగే కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని వెలిగండ్ల, సీఎస్‌పురం, పామూరు మండల నేతలు పనిచేస్తున్నారు. మొత్తానికి ఈ నాలుగు స్థానాల్లో టీడీపీ కంటే సొంత నేతలే వైసీపీని ఓడించేలా ఉన్నారు.