ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీలో బండి ఇప్పటికే ఓవర్ లోడ్ అయిపోయింది. ప్రస్తుతం పార్టీ స్ట్రాంగ్గా ఉండడంతో పాటు గత సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ .. ఉప ఎన్నికల్లోనూ తిరుగులేని భారీ విజయాలు నమోదు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం విపరీతమైన పోటీ నెలకొంది.
మరోవైపు జగన్ కనీసం 60 – 70 మంది ఎమ్మెల్యేలకు ఈ సారి టిక్కెట్లు ఇవ్వరని అంటున్నారు. ఈ లెక్కన చాలా మంది ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్క ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు అధికార వైసీపీ ఎమ్మెల్యేలు ఏకంగా జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఇప్పుడు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయి.
వీరిద్దరు రీసెంట్గా హైదరాబాద్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసినట్టు రాజకీయ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఓ ఎమ్మెల్యే ఇటీవల నేరుగా జగన్పై ఫైర్ అయ్యారు. అన్ని పనుల్లోనూ సీఎం జగన్కే క్రెడిట్ వస్తోంది. ఎమ్మెల్యేలుగా మేం సమాధానం చెప్పలేక పోతున్నాం అని తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఆయన పార్టీలో రెడ్డి వర్గంతో తన నియోజకవర్గంలో నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇక మరో ఎమ్మెల్యే కూడా గతంలో చిరంజీవి పార్టీలో పనిచేశారు. ఆయన కూడా తన నియోజకవర్గంలో రెడ్డి వర్గం నేతలతో ముప్పు తిప్పలు పడుతున్నారు. అంతేకాదు.. ఈ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పారు. తన వర్గం వారితో ధర్నాలు.. నిరసనలు కూడా చేయించారు. ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేల స్థానాల్లో గతంలో వైసీపీ నుంచి రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచిన సీట్లు.
వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ ఇక్కడ రెడ్లనే పోటీ చేయిస్తే ఎలా ఉంటుందా ? అన్న చర్చలు అధికార పార్టీ వర్గాల్లో స్టార్ట్ అయ్యాయి. దీంతో తమకు టిక్కెట్లు రావన్న డౌట్లు రావడంతో ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన వైపు చూస్తున్నట్టు భోగట్టా.. అన్నట్టు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా ప్రజారాజ్యం మూలాలు ఉన్నాయి.