బాలయ్య దెబ్బకు థియేటర్లు ‘బ్రేక్’ అవ్వాల్సిందే!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాపై కరోనా ప్రభావం పడింది. ఇటీవల బాలయ్య కరోనా బారిన పడటం, ఆ తరువాత చిత్ర సభ్యుల్లో మరికొందరు కరోనా బారిన పడటంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి వార్త వచ్చినా నందమూరి అభిమానులు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను పూర్తిగా కమర్షియల్ అంశాలతో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో దర్శకుడు గోపీచంద్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఇప్పటివరకు చూడని విధంగా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫస్టాఫ్ ఒక ఎత్తైతే, ఈ సినిమాకు అసలైనది ఇంటర్వెల్ బ్యాంగ్ అని తెలుస్తోంది. ఈ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, అప్పుడే బాలయ్య పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ఇంట్రొడ్యూస్ చేస్తారని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక ఫ్లాష్‌బ్యాక్ మొదలైన తరువాత నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. బాలయ్య అదిరిపోయే గెటప్‌లో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన కొన్ని బోల్డ్ డైలాగులు కూడా చెప్పబోతున్నాడట. బాలయ్యను ఇంత పవర్ఫుల్ పాత్రలో ఈమధ్య కాలంలో అభిమానులు చూసుండరని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.