త్వరలో అందాల బాల ‘మధుబాల’ బయోపిక్ తెరపైకి!

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల హడావుడి మొదలయ్యింది. ఈ క్రమంలో వచ్చిన టాలీవుడ్ సినిమా మహానటి ఎలాంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఎవరి మీద తీశారో వేరే చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి టాలీవుడ్ లో గొప్ప కీర్తిని అందుకున్నారు. ఇప్పుడు సావిత్రికి సమకాలికురాలు.. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ అయినటువంటి మధుబాల జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుందని వినికిడి. మధుబాల నటిగానే కాకుండా నిర్మాతగానూ క్లాసిక్ డేస్ లో పేరు తెచ్చుకున్నారు. దివంగత మధుబాల చిన్న చెల్లెలు మధుర్ బ్రిజ్ భూషణ్ నేతృత్వంలో కుటుంబ సభ్యుల మద్దతుతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం.

వీరే నిర్మించనున్నారు?

ఈ బయోపిక్ ని మధుబాల వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బేనర్ కింద బ్రిజ్ భూషణ్, ఆమె భాగస్వాములు అయినటువంటి అరవింద్ కుమార్ మాల్వియా, ప్రశాంత్ సింగ్, మాధుర్య వినయ్ సహకారంతో ఒక టాప్ స్టూడియో కం ప్రొడక్షన్ హౌస్ ఈ బయోపిక్ ని నిర్మించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం బ్రూయింగ్ థాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో మధుబాల కుటుంబం కలిసి పని చేయనుంది. మేటి క్లాసిక్ నాయిక మధుబాల బయోపిక్ అనగానే సినిమా అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి.

సావిత్రి బయోపిక్ కి ఏమాత్రం తీసిపోదు!

సావిత్రి బయోపిక్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాని తీయబోతున్నారట. ఈ సినిమాలో అనేక మంది అగ్ర నటీనటులు నటించనున్నారని వినికిడి. అయితే ఇంకా ప్రొడక్షన్ హౌస్ టీమ్ ని ఎంపిక చేయలేదు. ఈ బయోపిక్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది. మధుబాల జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీ కథను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి కంటెంట్ గురించి మాట్లాడటం చాలా తొందర పాటు ఉంది అని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నారు. దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియాల్సి వుంది.