తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ముందుకు సాగిన అన్నగారు నందమూరి తారకరామారావు.. ఇటు సినిమాల పరంగానే కాదు.. అటు రాజకీయంగా కూడా తనదైన శైలిలో ముందుకు సాగారు. ప్రతి అవకా శాన్నీ తెలుగు వారి కోణంలోనే చూశారు. ముఖ్యంగా ఆయనకు సాహిత్య అభిమానులు అన్నా.. రచయిత లు అన్నా.. ఎనలేని మక్కువ. ఎప్పుడు అవకాశం వచ్చినా..ఆయన తన అభిమానాన్ని చాటుకునేవారు. ఇలాంటి పరిణామమే ఒకసారి వచ్చింది.
అదే.. ప్రముఖ రచయిత.. రాజకీయ దురంధరుడు పీవీ నరసింహారావు.. ప్రధాని అయ్యే అవకాశం. కాంగ్రెస్ వంటి అతి పెద్ద జాతీయ పార్టీ రాజీవ్గాంధీ మరణం తర్వాత.. డోలాయమానంలో పడిపోయింది. ఈ సమయంలో పీవీకి ప్రధాని అయ్యే అవకాశం దక్కింది. ఆయన పక్కా తెలుగు వారు. దిగ్గజ రచయిత కూడా. సినిమాల్లో కాకపోయినా.. తెలుగు సాహిత్య రంగంలో పీవీకి ఎనలేని పేరుంది. అప్పటికే ఆయన తెలుగు సాహిత్యంలో ఒక సంచలనంగా ఉన్న వేయిపడగలు నవలను హిందీలోకి అనువదించారు.
దీంతో కేంద్ర హిందీ సాహిత్య అకాడమీ అవార్డును కూడా ఆయన సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో రాజకీయంగా ఒకవైపు.. సాహిత్య పరంగా మరోవైపు.. పీవీ చేస్తున్న కృషిని గమనించిన అన్నగారు.. ఆయన ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని తెలిసి సంతోషించారు. అంతేకాదు.. ఫోన్లోనే ఆయనను అభినందించారు. నంద్యాల నుంచి ఎంపీగా పోటీ చేసిన సమయంలో తమకు పట్టు ఉన్నప్పటికీ.. అన్నగారు అక్కడ ఎవరినీ పోటీకి నిలపకుండా.. పీవీ విజయం సాధించేందుకు కృషి చేశారు.
దీనిపై జాతీయ మీడియా అన్నగారిని ప్రశ్నించింది. మీరు ఓడిపోతారనే ఉద్దేశంతోనే.. ఇలా చేశారా? అని! దీనికి అన్నగారు… బదులిస్తూ.. ఒక తెలుగువాడు.. ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, అంతకు మించి.. ఒక సాహిత్య పిపాసి ప్రధాని పీఠంపై కూర్చుంటే.. దేశ సంస్కృతి సంప్రదాయాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని.. అందుకే తాము పోటీ పెట్టలేదని వివరించారు. దీంతో అప్పటి వరకు అన్నగారిపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టినట్టు అయింది. నిజానికి రాజకీయాల్లో ఉన్న వారు.. రాజకీయంగానే ఆలోచిస్తారు. కానీ, అన్నగారు మాత్రం రాజకీయాల్లో ఉన్నప్పటికీ.. తెలుగు సంస్కృతికి.. సాహిత్యానికి పెద్దపీట వేశారని అప్పట్లో చర్చ నడిచింది.