పార్టీ మారుతోన్న వంగ‌వీటి… వంశీతో భేటీ వెన‌క క‌థ ఇదే..!

ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారుతూ వ‌చ్చి ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రంగా కుమారుడు రాధా మ‌రోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారా ? ఆయ‌న మ‌ళ్లీ త‌న పాత పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారా ? అంటే తాజాగా బెజ‌వాడ రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తుంటే అవును అన్న ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు అయిన‌ టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధా రహస్యంగా భేటీ అయ్యారు.

వీరిద్ద‌రు పాత మిత్రులే అయినా రాజ‌కీయంగా ఎప్పుడూ వేర్వేరు పార్టీల్లోనూ ఉంటూ వ‌స్తున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ విష‌యం మీడియాకు తెలిసి వంశీని ప్ర‌శ్నించ‌డంతో తాము మిత్రులం అని.. చాలా రోజుల త‌ర్వాత క‌లుసుకోవ‌డంతో మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నామ‌ని చెప్పినా లోప‌ల మాత్రం వీరి మ‌ధ్య రాజ‌కీయ‌ప‌ర‌మైన చ‌ర్చ‌లే జ‌రిగిన‌ట్టు టాక్ ?

కొద్ది రోజుల క్రితం రంగా వ‌ర్థంతి సంద‌ర్భంగా కూడా వంశీ రాధాను ఆయ‌న ఆఫీస్‌లో క‌లుసుకుని రంగా విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. రాధా పేరుకు మాత్ర‌మే టీడీపీలో ఉన్నా ఆయ‌న రాజ‌కీయ ప‌య‌నం మ‌ళ్లీ మారుతుంద‌న్న ప్ర‌చార‌మే కొద్ది రోజులుగా జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత రాధా రాజ‌కీయం రోజుకో ర‌కంగా మారుతోంది. ఓ సారి జ‌న‌సేన మీటింగ్ జ‌రుగుతుంటే అక్కడ‌కు వెళ్లాడు.

మ‌ధ్య మ‌ధ్య‌లో వైసీపీ వాళ్ల‌ను క‌లుస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత అమరావతి ఉద్యమం సమయంలో చంద్రబాబును విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయడంతో చంద్ర‌బాబును క‌లిసి అమ‌రావ‌తి ఉద్య‌మంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వంశీతోనూ రాధా చనువుగా ఉంటున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండ‌డంతో పాటు టీడీపీలో అవ‌కాశాల‌కు త‌క్కువుగా స్కోప్ ఉంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలోనే రాధా మ‌ళ్లీ వైసీపీ వైపు చూస్తున్న‌ట్టు టాక్ ?