ఆ త‌ప్పుల వ‌ల్లే తెలుగు ప్రేక్ష‌కుల‌కు దూర‌మ‌య్యా: జ‌య‌ప్ర‌ద‌

అందాల తార జయప్రద గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. చిరంజీవి లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ఈమె ఉన్నట్టుండి తెలుగు ప్రజలకు దూరం అయింది. ఇకపోతే సీనియర్ నటిగా , మాజీ రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూనే.. ఒకవైపు సినిమాలలో.. మరొకవైపు రాజకీయాలలో కూడా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పని చేయక పోయినప్పటికీ ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

జయప్రద ప్రస్తుతం బిజెపి పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన కెరీర్ గురించి.. సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి తెలియజేసింది. ఇకపోతే ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని చెబుతూనే ఎన్టీఆర్ ఒక రోల్ మోడల్ అని తెలిపింది అని , చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను అని, పూర్తిగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్టీఆర్ ద్వారా ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాను అని ఆమె తెలిపింది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు ఫోన్ చేసి పార్టీలో చేరమని చెబితే వెంటనే ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశానని .. అయితే ఎలాంటి పదవులు ఆశించలేదు అని కేవలం ఎన్టీఆర్ ను ముఖ్య మంత్రిగా చూడాలన్నది లక్ష్యమని జయప్రద తెలిపింది. ఇలా రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ని చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ ను వదిలి చాలా మంది ఎమ్మెల్యేలు బలవంతం మీద ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబుకు ఏకీభవించారు.

నేను కూడా చంద్రబాబుకు మద్దతు పలికాను. ఇక అదే జీవితంలో నేను చేసిన పొరపాటు. ఎన్టీఆర్ గారు నన్ను నమ్మి పార్టీలోకి ఆహ్వానిస్తే నేను మాత్రం ఆయన దగ్గర ఉండాల్సిన సమయంలో ఉండకుండా బయటికి వచ్చాను అంటూ ఆమె తెలిపింది. ఇక చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత తాను రాజ్యసభ సభ్యురాలిగా పదవిలో ఉన్నానని ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలకు విలువ ఇవ్వడం.. అలాగే పార్టీ నేతలతో ప్రవర్తించే తీరులో పెద్ద మార్పులు వచ్చాయని.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం వల్లే తెలుగు ప్రజలను వదిలి వెళ్లాల్సి వచ్చిందని జయప్రద తెలిపింది.