ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు అనూహ్యమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు, కేడర్ తర లి వచ్చారు. రెండు రోజులు కూడా నేల ఈనిందా! అన్న టైపులో ప్రజలు జోరెత్తారు. చంద్రబాబు కూడా చాలా ఆనందపడ్డారు. అనుకున్న దానికన్నా కూడా.. ఎక్కువ మంది వచ్చారంటూ.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన మహానాడును తలపించిందని.. చంద్రబాబు చెప్పారు. వచ్చి న వారంతా.. అనేక నిర్బంధాలను తట్టుకుని మరీ.. వచ్చారని.. చంద్రబాబు అన్నారు.
అయితే.. ఇంతబాగా నిర్వహించిన మహానాడుపై కొన్ని గుసగుసలు హల్చల్ చేస్తున్నాయి. మహానాడు వేదికగా.. చంద్రబాబు పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం తో ముందుకు సాగుతున్నాం.. అనే విధంగా ఆయన దిశానిర్దేశం చేయకపోవడం.. వంటివి కూడా .. పార్టీలో గుసగుసలు వినిపించేలా చేసింది. నిజానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ పొత్తులపై ఒక క్లారిటీ ఇస్తారని అందరూ అనుకున్నారు. అయితే.. ఆయన కనీసం.. పొత్తుల విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాదు.. ఇప్పుడు వైసీపీ అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలపై కూడా చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. వాటి వల్ల.. ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. రాష్ట్రం అప్పుల పాలవుతోందని.. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము వస్తే.. రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు.
కానీ, ఎలా గాడిలో పెడతారు? ఏవిధంగా ఇప్పుడున్న అప్పులు తీర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటా రు..? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇక, ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కీలకమైన అమ్మ ఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం, ఆర్బీకే కేంద్రాలను ఉంచుతారా? లేక.. పక్కన పెడతారా? అనేది కూడా ప్రస్తావించకపోవడంపై.. టీడీపీలోనే గుసగుస వినిపిస్తోంది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే.. మీరు ఆ పథకాలు ఉంచుతారా? తీసేస్తారా? అంటే. ఏం చెప్పాలనేది.. నాయకుల ప్రశ్న. ఏదేమైనా.. మహానాడు జోరుగా సాగినా.. కొన్నిప్రశ్నలకు మాత్రం సమాధానం లభించలేదని అంటున్నారు.