ఏపీ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాజకీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమం లోనే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన, టీడీపీలు, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ పరిణామమే ఏపీలో రాజకీయ చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీతో టచ్లో ఉన్న .. గత రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న.. బీజేపీ నేతలు.. పవన్ను జారిపోకుండా చూసుకునేందుకు వివిధప్రయత్నాలు చేస్తున్నారు.
ఎక్కడ, ఎప్పుడు అవకాశం చిక్కితే.. అక్కడ పవన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు. జనసేనతోనే తమ పొత్తు ఉంటుందని.. తాజాగా కూడా సీనియర్ నాయకులు చెప్పారు అంతేకాదు.. జనసేన పార్టీని మసాలాతో పోల్చి మరీ వర్ణించారు. కూరలో మసాలా లేకపోతే.. రుచి ఉండదని.. బీజేపీ కూరలో పవన్ మసాలా వంటి నాయకుడు అంటూ.. బీజేపీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇక, వచ్చే ఎన్నికల్లో పవన్తోనే తమ ప్రయాణం సాగుతుందని.. జనసేనతోనే కలిసి నడుస్తామని.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని.. చెబుతున్నారు. ఇలా.. బీజేపీ నాయకులు పవన్ను తమభుజాలపైకి ఎక్కించుకుంటున్నారు.
అయితే.. మరోవైపు.. టీడీపీ నేతలు.. కూడా పవన్ను తమ వెనుక తిప్పుకొనేందుకు ప్రయత్నాలు ప్రారం భించారు. దీనికి సంబంధించి.. అంటే.. వచ్చే ఎన్నికల్లో పవన్తో కలిసి పనిచేసే విషయంపై నాయకులు అప్పుడే లీకులు ఇవ్వడం ప్రారంభించారు. అనంతపురానికి చెందిన సీనియర్ నేత జేసీ ప్రభాకర్రెడ్డి.. పవన్తో టీడీపీ పొత్తు విషయంపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు బలం పెరుగుతుందని.. టీడీపీతో కలిస్తే.. ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఎదగొచ్చని..ఆయన సూత్రీకరించారు. అయితే.. ఇదేదో మాట వరసకు చెప్పింది కాదని అంటున్నారు పరిశీలకులు.
గత కొన్నాళ్లుగా టీడీపీ.. జనసేనవైపు, జనసేన కూడా టీడీపీ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బలమైన వైసీపీని తట్టుకుని.. గెలుపు గుర్రం ఎక్కాలంటే.. ఖచ్చితంగా తమ మధ్య పొత్తు అవసరమని.. భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా.. సీనియర్ నాయకులు ఇలా వ్యాఖ్యలు చేస్తూ. పార్టీ శ్రేణులను జనసేనతో కలిసి.. పనిచేసేలా ప్రోత్సహిస్తున్నారని అంటున్నారుపరిశీలకులు. రాజకీయాల్లో శాశ్వత శతృవులు ఉండరు కాబట్టి.. వీరు చేస్తున్న ప్రయత్నాల విషయంపై ఎలాంటి విమర్శలు రావడం లేదు. మరోవైపు ప్రజలను కూడా.. ఈ పొత్తు విషయంలో మానసికంగా సిద్ధం చేస్తున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.