మంత్రివర్గ విస్తరణ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పారు. ఇక కొందరు మంత్రులు రాజీనామా చేయాలని.. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 3-4 గురు మంత్రులు మాత్రమే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మంత్రి పదవిపై ఆశలతో ఉన్నవారు అప్పుడే తమకే మంత్రి పదవి వస్తుందంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో తమకు పదవి దక్కుతుందని ఆశతో ఉన్నారు.
వీరభద్రస్వామి వైశ్య వర్గం, రాజన్నదొర ఎస్టీ. ఇక శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని ఆశలతో ఉన్నారు. విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ పేరే గట్టిగా వినిపిస్తోంది. ఇక తూర్పుగోదావరి నుంచి తుని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది.
పశ్చిమగోదావరి నుంచి ముదునూరి ప్రసాదరాజు, భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాస్, తలారి వెంకట్రావు రేసులో ఉన్నారు. ఇక కృష్ణా జిల్లాలో పేర్ని నాని, కొడాలి నాని ఇద్దరు కంటిన్యూ అవుతారా ? లేదా ? అన్నది సస్పెన్స్. అయితే కొలుసు సారథికి ఈ సారి మంత్రి పదవి పక్కా అంటున్నారు. ఒకవేళ ఉదయభానుకు అవకాశం ఉంటే పేర్ని నాని అవుటే..!
ఇక గుంటూరు జిల్లాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని సిఎం హామీ ఇచ్చారు. అలాగే చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్కు కూడా హామీ ఇచ్చినా ఆ కోరిక నెరవేరడం కష్టంగానే ఉంది. బాపట్ల నుంచి కోన రఘుపతి, మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా శలు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలో బాలేనిని కొనసాగనున్నారు.
నెల్లూరు నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎస్సి కోటాలో కిలివేటి సంజీవయ్య, చిత్తూరు జిల్లా నుంచి రోజా వంటి వారు రేసులో ఉన్నారు. అనంత నుంచి అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి, కర్నూలు నుంచి చక్రపాణిరెడ్డి ఆశలతో ఉన్నారు. ఓవరాల్గా అత్యధిక మంది రెడ్డి సామాజికవర్గం వారే పదవులకు పోటీ పడుతున్నారు. మరి సీఎం జగన్ ఈ సారి ఏం చేస్తారో ? చూడాలి.