ఏపీలో వైసీపీ మంత్రుల రాజీనామాలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27న మంత్రులు అందరూ రాజీనామాలు చేయాలని జగన్ ఇప్పటికే దిశానిర్దేశాలు చేశారు. ఉగాది రోజు కొత్త మంత్రి వర్గం కొలువు తీరనుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముందే చెప్పినట్టు కేబినెట్ మార్పుపై మనసులో మాటను బయట పెట్టారు.
సామాజిక సమీకరణల రీత్యా ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులంతా రాజీనామాలు చేసి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని కూడా జగన్ కోరారు. ఇక మంత్రుల రాజీనామా.. కొత్త మంత్రి వర్గం డేట్ కూడా ఫిక్స్ అవ్వడంతో జగన్ కేబినెట్లో కొత్త మంత్రులు ఎవరు ? అన్నదానిపై రకరకాల చర్చలు అయితే స్టార్ట్ అయిపోయాయి.
ఇక అసెంబ్లీ లాబీల్లో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు తోటి ఎమ్మెల్యేలు కాబోయే మంత్రులకు కంగ్రాట్స్ అని చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు, అలాగే విశాఖ జిల్లాకు చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు కూడా తోటి ఎమ్మెల్యేలు కాబోయే మంత్రులు అని కంగ్రాట్స్ చెప్పారు.
ఇక పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనని చెప్పిన నేపథ్యంలో టీడీపీ – జనసేన – బీజేపీ కలిస్తే పరిస్థితి ఎలా ? ఉంటుంది ? వైసీపీ ఆ మూడు పార్టీల కూటమిని ఎలా ? ఎదుర్కొంటుంది ? అన్న దానిపై కూడా చర్చలు జరిగాయి. ఏదేమైనా మంత్రి వర్గ ఆశావాహుల్లో ఆనందం అయితే మామూలుగా లేదు.