ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పటికిప్పుడు కావాల్సింది.. చురుకుదనం.. వేడి.. చొరవ.. ఢీ అంటే.. ఢీ అనే నేతలు… ప్రజల్లోకి చొచ్చుకుపోయే నాయకులు! అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు ఎంత మందిలో ఈ లక్షణాలు ఉన్నాయి.? ఎంత మంది పార్టీ లో దూకుడుగా ఉన్నారు? అనే విషయం ఆసక్తిగా మారింది. మరీ ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు శపథం నెరవేర్చాలనే సంకల్పం ఉంది. అయినప్పటికీ..కొందరు మాత్రం.. చురుగ్గా వ్యవహరించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా జిల్లాలకు అధ్యక్షులుగా ఉన్న.. నాయకులే చతికిల పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీరిలో ప్రధానంగా సీమలోని అనంతపురం జిల్లా, హిందూపురం పార్లమెంటరీ జిల్లా, విజయవాడ పార్ల మెంటరీ జిల్లా, కడప జిల్లా ప్రొద్దుటూరు ఇంచార్జ్.. ఇలా అనేక మంది వెనుక పడ్డారనే వాదన వినిపిస్తోంది. వీరిలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి, లింగారెడ్డి, మాజీ మంత్రి నెట్టెం రఘురాం వంటివారు.. జోరుగా లేకపోవడం.. పార్టీ కార్యక్రమాల్లోనూ బయట కూడా వాయిస్ వినిపించలేక పోవడం వంటివి పార్టీలో చర్చకు దారితీస్తున్నాయి.
అసలు వీళ్లు పార్టీకి భారంగా మారి అవుట్ డేటెడ్ అయిపోయారని.. అయినా చంద్రబాబు వీళ్లకు ఎందుకు కీలకమైన పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించారో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులుగా ఉన్న కాల్వ, పార్థసారథి పార్టీని బ్రష్టు పట్టించేస్తున్నారు. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం ఓపెన్గానే తన అసహనం వ్యక్తం చేశారు. మూడు సార్లు ఓడినలింగారెడ్డి ప్రొద్దుటూరు టీడీపీనే పాతరేస్తే… ఆయనకు ఏకంగా కడప పార్లమెంటరీ పార్టీ పగ్గాలు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి. విజయవాడలో నెట్టెం రఘురంను ప్రజలు, పార్టీ వాల్లే ఎప్పుడో మర్చిపోయారు.
జిల్లా లేదా పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న నాయకులు పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవ సరం ఎంతో ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత దాదాపు వీరిపైనే ఉంటుంది. అయితే.. వీరు మాత్రం సైలెంట్గా ఉండడం.. పార్టీలో కార్యకర్తలకు జోష్ పెంచేలా కార్యక్రమాలు నిర్వహించక పోవడం.. కేవలం పార్టీ అధినేతను పొగడ్తలతో ముంచెత్తడానికి మాత్రం పరిమితంకావడం వంటివి పార్టీకి ఏమరకు లబ్ధి చేకూరుస్తాయనేది ప్రధాన ప్రశ్న. జిల్లా అధ్యక్షులుగా ఉన్నవారు.. పార్టీని భుజాన వేసుకుని ముందుకు నడిపించాలి. ప్రత్యర్థులను టార్గెట్ చేయాలి.
ప్రజల మధ్య ఉండాలి. కానీ.. వీరు మాత్రం చంద్రబాబు నిర్వహించే టెలీ కాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప.. పెద్దగా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పరిస్థితి నానాటికీ తీసికట్టుగామారుతోందనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. మరి వీరిలో ఫైర్ లేనప్పుడు.. వీరు ఫ్లవర్స్ కాక.. ఫైర్ ఎలా అవుతారని తమ్ముళ్ల మధ్య చర్చ జరుగుతుండడం విశేషం.