మహేష్ పక్కన సమంత కాదట.. మళ్లీ ఆ పాపనే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే షూటింగ్ మెజారిటీ షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. అన్నీ బాగుంటే ఈ సంక్రాంతికే మహేష్ బొమ్మ వెండితెరపై కనిపించేది. కానీ ప్రస్తుతం నెలకొన్న వివిధ కారణాల కారణంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ అనేకసార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా ఆర్థిక నేరాల కథాంశంతో వస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే మహేష్ నెక్ట్స్ చిత్రాల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తన నెక్ట్స్ చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నట్లు గతంలోనే వెల్లడించాడు. అయితే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేకపోవడంతో, మహేష్ తన నెక్ట్స్ మూవీని వీలైనంత త్వరగా మరో డైరెక్టర్‌తో ముగించేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దీంతో గతంలో తనకు అతడు, ఖలాజా వంటి చిత్రాలను అందించిన దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన నెక్ట్స్ చిత్రాన్ని ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాతో మహేష్‌కు అదిరిపోయే హ్యాట్రిక్ విజయాన్ని అందించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. బాబు కోసం సాలిడ్ కంటెంట్‌ను రెడీ చేస్తున్నాడట ఈ మాటల మాంత్రికుడు. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌గా స్టార్ బ్యూటీ సమంతను ఫైనల్ చేశారనే టాక్ ఇటీవల చిత్ర వర్గాల్లో జోరుగా వినిపించింది.

కానీ ఇప్పుడు ఈ సినిమాలో సమంత స్థానంలో మరో బ్యూటీని తీసుకున్నట్లు చిత్ర వర్గాల్లో ఓ వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాలో సమంత కొన్ని కారణాల వల్ల చేయలేకపోవడంతో ఆమె స్థానంలో స్టార్ బ్యూటీ పూజా హెగ్డేను తీసుకున్నారట చిత్ర యూనిట్. ఈ మేరకు పూజా ఈ సినిమాకోసం బల్క్ డేట్స్‌ను కూడా కేటాయించినట్లు చిత్ర వర్గాల సమాచారం. గతంలో మహేష్ బాబుతో మహర్షి చిత్రంలో పూజా హెగ్డే నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో నిజంగానే సమంత స్థానంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుందా అనే విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఏదేమైనా మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా అనగానే అంచనాలు మరో లెవెల్‌కు వెళ్లిపోగా, ఇప్పుడు హీరోయిన్ విషయంలో కూడా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.