పాపం శ్రీవల్లి… కరివేపాకులా పక్కనబెట్టిన సూపర్ స్టార్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ పుష్ప ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను ఏ రేంజ్‌లో చాటిందో అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబరు 17న రిలీజ్ చేయగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది. ఇక ఈ సినిమాను చూసిన వారందరూ పుష్ప చిత్రంలోని నటీనటుల పర్ఫార్మెన్స్‌ను పొగిడేస్తూ వారిని అభినందిస్తున్నారు.

ఇందులో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ లాంటి వారు కీలకపాత్రల్లో నటించి మెప్పించారని పలువురు సెలెబ్రిటీలు చెబుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ సినిమాలోని హీరోయిన్‌ను కూరలో కరివేపాకులా తీసి పక్కనపెట్టేసి, మిగతా టీమ్ సభ్యుల గురించి భజన చేశాడు. మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా పుష్ప చిత్రంపై తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు స్టన్నింగ్‌గా ఉందని మహేష్ ప్రశంసించాడు. బన్నీ చేసింది యాక్టింగ్ లాగా కనిపించలేదని.. ఇది ఒరిజినల్ అని ఆయన ట్వీట్ చేశాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, నిజాయితీగా ఉంటాయో సుకుమార్ మరోసారి నిరూపించుకున్నాడని మహేష్ అన్నాడు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరో లెవెల్‌లో ఉందని.. ఆయన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని మహేష్ చెప్పుకొచ్చాడు. పుష్ప సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ కష్టం తెరపై స్పష్టంగా కనిపించిందని మహేష్ చెప్పుకొచ్చాడు.

అయితే పుష్ప చిత్రాన్ని చూసిన మహేష్ బాబు ఈ చిత్ర యూనిట్‌ను పొగిడే క్రమంలో ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రను పూర్తిగా పక్కనబెట్టేశాడు. కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలు, సంగీత దర్శకుడు ఇలా అందర్నీ పేరుపేరునా పొగిడిన మహేష్.. ఎందుకో రష్మిక మందన ఊసే ఎత్తలేదు. గతలంలో తనతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన రష్మిక మందన యాక్టింగ్ గురించి ఏమాత్రం చెప్పకపోవడంతో రష్మిక ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. మహేష్ బాబుతో కలిసి నటించిన హీరోయిన్‌ను ఇలా ఏమాత్రం పట్టించుకోకపోవడం ఏమిటి సార్ అంటూ ఆమె అభిమానులు మహేష్‌ను ప్రశ్నిస్తున్నారు.