బాలయ్య స్పీచ్‌పైనే అందరి చూపులు.. కడిగిపాడేస్తాడా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్. దీంతో ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి వస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలయ్య ఎలా మాట్లాడతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో కొత్త జీఓ జారీ చేయడం పట్ల సినీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు బాలయ్య ఈ అంశంపై జగన్ సర్కార్‌పై ఎలా ఫైర్ అవుతారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అటు ఏపీ రాజకీయాల గురించి బాలయ్య ఏమైనా మాట్లాడుతాడా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక అఖండ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడం విశేషం. ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్‌కు అదిరిపోయే ఆదరణ లభించడంతో ఈ సినిమాలో ఆయన నటవిశ్వరూపాన్ని చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబో ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందని చిత్ర వర్గాలు పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరిలో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.