వైరల్ : హాలిడే కోసం వెళ్ళిన ఆ దంపతులకు అనుకోని షాక్ …!

పారా సైలింగ్ చేయాలనుకున్న ఓ జంట పారాషూట్ లో పైకి ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా దానికి ఉన్న తాడు తెగిపోయి సముద్రంలో పడిపోయారు. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

గుజరాత్ కు చెందిన అజిత్ కథడ్ ( 30), సరళ కథడ్ (31) హాలిడే ట్రిప్ కోసం దయూలోని నంగావ్ బీచ్ కు వెళ్లారు. పారా సెయిలింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే పవర్ బోటు నుంచి నిపుణల నేతృత్వంలో వారిద్దరూ పారా షూట్ లో పైకి ఎగిరారు. అయితే అలా పైకి వెళుతుండగానే పవర్ బోర్డు పారాషూట్ కు అనుసంధానంగా ఉండే తాడు ఒక్కసారిగా తెగిపోయింది. దీంతో వారిద్దరూ ఒక్కసారిగా సముద్రంలో పడిపోయారు. దీంతో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. అజిత్ కథడ్ సోదరుడు రాకేష్ భయంతో అరవడం మొదలుపెట్టాడు.

అయితే పారా షూట్ లో కొద్ది దూరం వరకు మాత్రమే ప్రయాణించడంతో తక్కువ ఎత్తులో నుండే ఆ జంట పడిపోయారు. దీన్ని గమనించిన అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే వారు నీటిలోకి దూకి వారిని రక్షించారు. అయితే ముందు జాగ్రత్తగా ఆ జంట లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో నీటిలో మునిగిపోకుండా బయటపడ్డారు. కానీ వారికి ఎలాంటి గాయాలు తగలకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు.

దీనికి సంబంధించిన వీడియోను అజిత్ కథడ్ తమ్ముడు రాకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ.. తన సోదరుడు గాల్లోకి ఎగురుతూ ఉండగా వీడియో తీశానని, తాడు తెగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదని పేర్కొన్నాడు. అయితే తాడు బలహీనంగా ఉందని, తెగి పోతుందేమోనని ముందుగానే సిబ్బందికి హెచ్చరించానని చెప్పాడు. అలా జరగడంతో తమ ప్రాణం పోయినంతపనైందని, నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని, ఇప్పటికీ ఆ షాక్ నుంచి తమ కుటుంబం ఇంకా కోలుకోలేదని చెప్పుకొచ్చాడు.