తెరాస,కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ మైండ్ గేమ్..!

హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించిన తరువాత కాస్త వేగంగా పావులు కదుపుతోంది. టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. వరి కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త నిరసనలు.. జీహెచ్ఎంసీ సమావేశాలు నిర్వహించడం లేదని నిన్న ఆందోళనలు చేస్తూ టీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అసెంబ్లీలో తమ పార్టీ బలాన్ని 3 నుంచి 30 వరకు.. వీలైతే అధికారం చేజిక్కించుకునేంతవరకు పోరాడాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు నగరంలో రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. దానికి పార్టీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ ఇన్ చార్జి తరుణ్ చుగ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలతో మైండ్ గేమ్ ఆడటం ప్రారంభించింది.

అధికార టీఆర్ఎస్ పార్టీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి రెండు డజన్ల మందు బలమైన నాయకులు తమతో టచ్ లో ఉన్నారని తరుణ్ చుగ్ చెప్పారు. అంటే.. వారంతా ఎప్పుడైనా కమలం నాయకుల జాబితాలోకి చేరిపోతారనేది ఆయన భావం. బలమైన నాయకులు అంటే ఎమ్మెల్యేలు కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్ ను వీడి కమలం వైపు రారు. వచ్చే అవకాశం లేదు. కేసీఆర్ నిర్ణయాలు నచ్చినా..నచ్చకపోయినా అక్కడే ఉంటారంతే. అసలే అధికార పార్టీ.. దానిని విడిచి ముగ్గురు ఎమ్మెల్యేలున్న బీజేపీకి గూటికి ఎందుకు చేరతారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది వాస్తవమే. అయితే.. ఢిల్లీలో పవర్ లో ఉందని ఇక్కడి పవర్ ఎందుకు వదులుకుంటారు? ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీజేపీ వైపు పెద్దగా చూస్తున్నట్లు లేరు. ఆల్రెడీ వెళ్లాల్సిన నాయకులు డీకే అరుణ లాంటి వాళ్లు కమలం కండువా కప్పుకున్నారు. ఇపుడు వారికి అటువంటి ఆశలేం లేవనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకుడున్నాడు. అక్కడ వారు చెప్పిందే రాజ్యం.. మరి అలాంటిది బీజేపీకి వచ్చి వారు చేసేదేముంది. అంటే.. కాంగ్రెస్ నుంచి కూడా ఇప్పట్లో ఎవరూ రారు. తరుణ్ చుగ్ కామెంట్స్ చూస్తుంటే జస్ట్ మైండ్ గేమ్ అని తెలుస్తుంది అంతే..