రాశిఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రాశి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుందట. అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. తన తొలి మూవీ సమయంలో అలా ఆలోచించిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మనం కంటే ముందు రాశిఖన్నా `మద్రాస్ కేఫ్` చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదే ఆమె తొలి చిత్రం. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి.. ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. రాశి మాట్లాడుతూ.. `తొలి సినిమా మద్రాస్ కేఫ్లో ఛాన్స్ వచ్చేవరకు నటనకు సంబంధించి నాకు ఎలాంటి పరిజ్ఞానం లేదు.
ముఖ్యంగా ఆ సినిమాలో హీరోతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి చాలా కష్టపడ్డా. ఆ సీన్స్ చేశాక వ్యానిటీ వ్యాన్లోకి వెళ్లి తెగ ఏడ్చాను. ఆ టైమ్లోనే సినిమాలకు గుడ్బై చెప్పాలనిపించింది. కానీ, నటనలో అవన్నీ ఓ భాగమేనని అర్థం చేసుకుని.. క్రమక్రమంగా నటనను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశా` అంటూ చెప్పుకొచ్చింది.