చిరంజీవి ఓటు నాకే అంటున్న మంచు విష్ణు?

మా ఎన్నికల దగ్గర పడటంతో వ్యవహారం రోజు రోజుకూ వేడెక్కుతోంది.ఇంకొక రెండు వారాల్లోనే ఎన్నికల జరగనుండటంతో ఒక వైపు ప్రకాష్ రాజ్ వర్గం, మరొక వైపు మంచు విష్ణు వర్గం అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సోమవారమే నామినేషన్లు ఫైల్ చేయగా మంచు విష్ణు బృందం కూడా ఒక, రెండు రోజుల్లో నామినేషన్లు వేయబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ టీవీ ఛానెల్‌తో మంచు విష్ణు మాట్లాడుతూ మా ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఎవరికి ఉందో వారే విజేతలు అవుతారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఓటు తనకే అని విష్ణు ప్రకటించడం విశేషం.

త్వరలోనే మంచు విష్ణు బృందం తరపున నామినేషన్ వేసి ఆ తర్వాత చిరంజీవిని కలుస్తానని కచ్చితంగా ఆయన తనకు మద్దతు పలుకుతారని ధీమా వ్యక్తం చేశాడు. మంచు విష్ణు ప్యానల్ మ్యానిఫెస్టో చూపించి తాను ఏం చేయాలి అనుకుంటున్నానో వివరిస్తే కచ్చితంగా చిరంజీవి ఓటు తనకే పడుతుందని విష్ణు అన్నాడు. అలాగే మా కోసం ఏం చేయాలనే విషయంపై తన దగ్గర పక్కగా ప్రణాళికలు ఉన్నాయని తెలిపాడు. ప్రకాష్ రాజ్ కంటే తానే మాకోసం ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలనని విష్ణు ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాను మా అధ్యక్షుడిని అయితే అప్పు చేసి అయినా మా కోసం సొంత భవనాన్ని నిర్మిస్తాను అని చెప్పాడు.