బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు..నాని ట్వీట్..!

హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనను అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని కఠిన శిక్ష విధించాలని వీఐపీలు సహా సామాన్యులు కోరుతున్నారు. మంచు మనోజ్ బాధిత కుటుంబానికి పరామర్శ తెలిపి ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ప్రజలు కూడా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులకు సహకరించాలని కోరాడు.

హీరో మహేష్ బాబు కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశాడు. సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోతున్నాయో ఈ ఘటన గుర్తు చేస్తోందని అన్నారు. చిన్నారి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని మహేష్ బాబు అధికారులను కోరారు. తాజాగా చిన్నారి హత్యాచారం పై నాని స్పందించాడు. అత్యాచార ఘటనలో నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ 10 లక్షల రివార్డు అందజేస్తామని నగర పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో పోలీసులు పోస్ట్ చేసిన ఫోటోను షేర్ చేసిన నాని ‘బయటెక్కడో ఉన్నాడు ఉండకూడదు’ అని ట్వీట్ చేశాడు. హత్యాచార ఘటనపై నాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైదా బాద్ హత్యచార ఘటనపై సామాన్య ప్రజానీకం ఆగ్రహంతో ఉంది. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. నెటిజన్లు ట్విట్టర్లో #whereispallamkondaraju అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్లు చేస్తున్నారు.