దర్శకుడు శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మద్రాస్ రాజధానిగా తెలుగు, తమిళ ప్రజలు కలిసి ఉన్న రోజుల్లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
అయితే ఇదే కాన్సెప్టుతో కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన `మద్రాస్` సినిమా విడుదలకు సిద్దమైంది. ఇప్పుడు ఈ విషయమే శేఖర్ కమ్ముల & టీమ్ కు చెమటలు పట్టిస్తోందని ప్రచారం జరుగుతోంది. 2014లో తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన మద్రాస్ సినిమాను ఇప్పుడు అదే పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు.
రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను విమర్శకుల ప్రశంసలే కాదు కమర్షియల్ గానూ విజయం అందుకుంది. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ ను థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా పోస్టర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు.