కేసీఆర్ అలా చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా

తెలుగుదేశం పార్టీలో ఉండి.. అక్కడ ఇమడలేక.. బీజేపీలో చేరి ఆ తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసి ఇపుడు కేసీఆర్ కు మద్దతు పలుకుతున్న మోత్కుపల్లి నరసింహులు ఆదివారం షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఇటీవల దళిత బంధు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. పేద దళిత కుటుంబాలకు రూ. పది లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకంపై విమర్శలు రాకున్నా.. రాష్ట్రమంతా అమలు చేయాలి అనే డిమాండ్ ఊపందుకుంది. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లే..దళితులకు మూడెకరాల పొలం పంచినట్లే ఉంటుంది ఈ దళిత బంధు పథకం అని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ క్రమంలో మోత్కుపల్లి కేసీఆర్ కు మద్దతుగా హైదరాబాదులో ఆదివారం ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత బంధును కచ్చితంగా అమలు చేస్తారు.. అమలు చేస్తారనే నమ్మకం నాకుంది.. ఒకవేళ అలా కాకపోతే యాదగిరిగుట్ట వద్ద ఆత్మహత్య చేసుకుంటా అని వెల్లడించారు. మోత్కుపల్లి మాటలకు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరైతే కేసీఆర్ పై ఎంత నమ్మకమో అని గుసగుసలాడారు. పనిలోపనిగా రేవంత్ రెడ్డిని కూడా విమర్శించారు మోత్కుపల్లి. రేవంత్ వల్లే చంద్రబాబు నాశనమయ్యాడని, పార్టీ ఈయన వల్లే దెబ్బతినిందని ఆరోపించారు. అంతకుముందు మోత్కుపల్లి ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.